Bandi Sanjay Nirudyoga Garjana

రాజభోగాలు మీకు.. కడుపు మంటలు నిరుద్యోగులకా?: బండి సంజయ్

1400 మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో, కేసిఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తూ…నిరుద్యోగుల కుటుంబాలకు మాత్రం కడుపు మంటలు, కడుపు కోతలు కల్గిస్తున్నదని, తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన కల్వకుంట్ల కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయని, దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళ అయ్యారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు ఈరోజు సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నేతలు అపూర్వ స్వాగతం పలికగా, తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బండి సంజయ్ కుమార్ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి బండి సంజయ్ తో కలిసి ఐబీ గెస్ట్ హౌజ్ నుండి పోతిరెడ్డిపల్లె చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు నడిచారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం అందించేదాకా పోరాడతామని తెలిపారు.

తెలంగాణలో రాబోయేది రామరాజ్యమేనని, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా తప్ప రంగు రంగుల పార్టీలకు చోటు లేదని బండి సంజయ్ ప్రకటించారు. ఈ నెల 14న హనుమాన్ జయంతి సందర్భంగా, హిందూ శక్తిని చాటేందుకు రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహించబోతున్నామని, హిందువులంతా హిందూ ఏక్తా యాత్రకు హాజరై గర్జించాలని కోరారు.