హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని లేఖలో పేర్కొంది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ఈ మేరకు లేఖను విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ చెప్పింది. దీంతో ఈ లేఖపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయో చూడాల్సి ఉంది..

