పెట్రోల్ బంకుల్లో రేషన్ విధానం?.. జియో-బీపీ పంపుల వద్ద రూ.1000 పరిమితి వార్తలు
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే భరోసా ఇస్తున్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో రేషన్ విధానం అమలవుతున్నట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా Reliance Industries మరియు BP భాగస్వామ్యంతో నడుస్తున్న ‘జియో-బీపీ’ పెట్రోల్ పంపుల్లో ఇంధన విక్రయాలపై పరిమితులు విధిస్తున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు.
వారి సమాచారం ప్రకారం, ఒక కస్టమర్కు రోజుకు రూ.1000 విలువైన పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. దేశంలో లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో సుమారు 2 వేల బంకులు ఈ జియో-బీపీ నెట్వర్క్కు చెందినవే.
ఈ పరిణామాలు వెనుక గ్లోబల్ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ చమురు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావం వల్ల క్రూడ్ ఆయిల్ రవాణా సాధారణ స్థితికి రాకపోవడం పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నందున, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ మార్గాన్ని ప్రమాదకరంగా వర్గీకరించడంతో ట్యాంకర్ల రాకపోకల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి.
అయితే, ఈ రేషనింగ్పై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. స్థానిక పరిస్థితులను బట్టి డీలర్లు తాత్కాలికంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండేందుకు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో నయారా ఎనర్జీ వంటి ఇతర ప్రైవేట్ సంస్థల ధరలను పెంచగా, ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పంపుల వద్ద కూడా కొన్ని చోట్ల పరిమితులు అమలవుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.
కేంద్ర చమురు శాఖ అంచనాల ప్రకారం, ప్రస్తుతం పెట్రోల్పై లీటరుకు సుమారు రూ.24.40, డీజిల్పై రూ.30 వరకు ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై దాడులు జరగడం కూడా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
యుద్ధ పరిస్థితులు మరింత ముదిరితే ఇంధన సరఫరాపై ఆంక్షలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
