తెలుగు ఐఏఎస్‌ అధికారి అక్రమాస్తులు ఈడీ స్వాధీనం

అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అరెస్ట్

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ కలెక్టర్‌ కంకిపాటి రాజేష్‌, అతడి బినామీగా ఉన్న రఫీక్‌కి సంబంధించి సూరత్‌లోని రూ.1.55 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజేష్‌ 2011లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. గుజరాత్‌ సురేంద్రనగర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. గుజరాత్‌ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

సూరత్‌కు చెందిన వ్యాపారి రఫీక్‌తో కలిసి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడం, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం, ఆయుధాల లైసెన్సులు, మైనింగ్‌ లీజులు.. తదితర అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయల ఆస్తులను ఆర్జించినట్లు సీబీఐ విచారణలో తేల్చింది. ఈడీ మనీ లాండరింగ్‌పై కేసు నమోదు చేసి రాజేష్‌ను ఆగస్టు 6న అరెస్టు చేసింది. తాజాగా రాజేష్‌, రఫీక్‌లకు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.