మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు

12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్ కుమార్ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ల ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్ కుమార్ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ల ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు మూడు నెలల్లోగా విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. జిల్లా జడ్జి సునీత వెలువరించిన తీర్పుతో పోలీసు వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఈ తీర్పు ఎన్ కౌంటర్ కు గురైన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ జర్నలిస్ట్ పాండే కుటుంబాలకు అనుకూలంగా పోలీసులకు వ్యతిరేకంగా వెలువడడంతో పోలీసు వర్గాలు కలవరం చెందుతున్నాయి.

సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్ ఇది..
2010 జూలై 1న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సమీపంలోని సర్కేపల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ జర్నలిస్ట్ హేమచంద్ర పాండే లు ఎన్‌కౌంటర్ అయ్యారు. తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మావోయిస్టులు సర్కేపల్లి అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో వెళ్ళగా అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో వారిద్దరు మరణించారని అప్పటి పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు పై ప్రజా సంఘాలతో పాటు మృతుల కుటుంబాల భార్యలు హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో పట్టుకొని ఆసిఫాబాద్ అడవుల్లోకి తీసుకువచ్చి బూటకపు ఎన్ కౌంటర్‌ల్లో హత్య చేశారని వారు ఫిర్యాదు చేశారు మరోవైపు సామాజిక పోరాట కర్త, మాజీ పార్లమెంటు సభ్యుడు స్వామి అగ్నివేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఎన్ కౌంటర్ బూటకం కాదని సీబీఐ పేర్కొనగా స్వామి అగ్నివేశ్ మరోసారి ఆదిలాబాద్ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు.

ఆదిలాబాద్ కోర్టులో కేసు నడుస్తుండగానే తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో కేసు వేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కింది కోర్టు తీర్పు చెప్పిందని పోలీసులు హైకోర్టునుగ ఆశ్రయించగా 2018లో దీనిపై విచారణ జరిగింది. విచారణ అనంతరం కేసును తిరిగి ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు హైకోర్టు విచారణ చేపట్టాలని సూచించింది. అప్పటినుంచి ఈ కేసు ఆదిలాబాద్ జిల్లా కోర్టులో నడుస్తోంది. ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర పాండే భార్య బినీత పాండేలు తోపాటు స్వామి అగ్నివేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై కేసు విచారణ జరిగింది.


జిల్లా కోర్టు తుది తీర్పుతో 29 మంది పోలీసులకు ఉచ్చు..
మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన తుది తీర్పు పోలీసు అధికారులకు ఉచ్చుబిగిసెలా ఉంది. అప్పటి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించలేమని చెప్పిన కోర్టు మళ్లీ విచారించాలని ఆదేశించింది ఈ విచారణ కూడా మూడు నెలల్లోగా ప్రారంభించాలని సూచించింది. తాజా తీర్పు బాధిత కుటుంబాలకు ఊరట ఇవ్వగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులకు ఆశనిపాతంలా మారింది. బాధితుల పక్షాన కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది రహీం కోర్టు వెలుపల పాత్రికేయులతో మాట్లాడారు. ఆజాద్ తో పాటు జర్నలిస్టు హేమచంద్ర పాండే ల ఎన్ కౌంటర్ బూటకం అని తేలిందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో 29 మంది పోలీసులు దోషులుగా మిగిలారని, సమాజంలో న్యాయవ్యవస్థపై ఈ తీర్పు మరింత గౌరవం పెంచిందని అభిప్రాయపడ్డారు నిందితులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.