Minister dayakar rao launches nutrition kit in bhupalapally

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ఘనంగా ప్రారంభోత్సవం

మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న ప్రాంతాలను ఎంపిక చేసి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భూపాలపల్లి జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, అనేక వసతులు ఇక్కడ సమకూరుతున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయిలో నేడు 9 జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకం ప్రారంభిస్తుండగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాల్గొని ఈ కిట్స్ ను గర్భిణీ స్త్రీలకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

“ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు. సీఎం గారు వారిని బాగా అభినందిస్తున్నారు. కరోనా సమయంలో బాగా కష్ట పడ్డారు. అందుకే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర వారికి ఆ గౌరవం దక్కింది. గతంలో ఆశా వర్కర్లకు 1500 రూపాయల వేతనం ఉంటే సీఎం కేసీఆర్ దానిని 9750 రూపాయలకు పెంచారు. అంగన్ వాడీల పరిస్థితి గతంలో తెలంగాణ రాకముందు ఘోరంగా ఉండేది…ఇప్పుడు వారికీ 13వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో గర్భిణీలు రక్త హీనతతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించి, ఈ జిల్లాను ఈ పథకం కింద సెలెక్ట్ చేసినందుకు సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు. హరీశ్ రావు గారు ఈ జిల్లాకు వచ్చినపుడు డాక్టర్ పోస్టులు కావాలని అడిగితే..వెంటనే 23 డాక్టర్ పోస్టులు మంజూరు చేశారు. భూపాలపల్లి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసుకున్నాం. 100 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం చేసుకున్నాం. 50 పడకల ఆయుష్ ఏర్పాటు చేసుకున్నాం. భూపాలపల్లిలో ప్రత్యేకంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేసిఆర్ కిట్స్ వచ్చాక నార్మల్ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎంలు గర్భిణీ స్త్రీలకు గుడ్లు, పోషకాహారం బాగా అందిస్తున్నారు. కలెక్టర్ గారి కొడుకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించడం అభినందించదగిన విషయం. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో బాగా నమ్మకం పెరుగుతుంది. గర్భిణికి నొప్పులు వస్తే ముందుగా ప్రభుత్వానికి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ రాగానే అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్ళి డెలివరీ చేయిస్తున్నారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 2079 డెలివరీలు జరిగితే..అందులో నార్మల్ డెలివరీ వెయ్యి మంది. ప్రైవేట్ హాస్పిటల్లో 1250 మంది డెలివరీ అయితే 178 నార్మల్ కాగా మిగిలినవన్నీ ఆపరేషన్లు జరిగాయి. భూపాలపల్లి జిల్లాలో గతంలోనే 20 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇంకా డ్యామేజ్ ఉంటే మరో 10 కోట్ల రూపాయలు ఇస్తాను.67 కొత్త గ్రామ పంచాయతీలు మంజూరు ఇచ్చాం. సీసీ రోడ్లు, కొత్త రోడ్లు ఇస్తాం. ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాం. భూపాల పల్లి జిల్లా బాగా అభివృద్ధి అవుతుంది. ఇది అన్ని రంగాల్లో ముందు ఉంటుంది.” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ వెంకటరమణ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి హర్షిని, కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అదే క్యాంపస్ లో ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే మొబైల్ క్యాంటీన్ మంత్రి ప్రారంభించి, లబ్ధిదారులకు అందించారు. మొబైల్ క్యాంటీన్లో తయారుచేసిన ఆహార పదార్థాలను రుచి చూసి వారిని అభినందించారు. బాగా కష్టపడి క్యాంటీన్లను నిర్వహించాలని, అభివృద్ధిలోకి రావాలని వారికి చెప్పారు. ఆహారాన్ని తయారుచేసేటప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, పరిశుభ్రత బాగా పాటించాలని సూచించారు.