Shri Venkateshwara Temple in Karimnagar

కరీంనగర్ లో కొలువుదీరనున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు

ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేసిన టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

ఈనెల 31న ఉదయం 7గం.26 నిమిషాలకు వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన

కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్ లో 10ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ల కృషితో కరీంనగర్ వాసులకు ఆ వెంకటేశ్వరుని దర్శన కల సాకారం ఔతుంది. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు లకు అందజేసారు.

ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మే 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుండి కరీంనగర్ ప్రజలతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విదంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ త్వరలోనే వినోద్ రావు, బాస్కర్ రావులతో కలిసి తిరుమలకు వెల్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాధ వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. అత్యంత త్వరలోనే శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశిస్సులు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు పాల్గొన్నారు.