కార్మికులు–పరిశ్రమల ప్రయోజనాలే లక్ష్యం.. సమతుల్య విధానంతోనే పారిశ్రామిక ప్రగతి: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
లేబర్ కోడ్స్పై తొందరపాటు నిర్ణయాలు ఉండవు.. భాగస్వాముల సూచనలతోనే రాష్ట్ర నిబంధనల రూపకల్పన
హైదరాబాద్, జూలై 7: కార్మికుల సంక్షేమంతో పాటు పరిశ్రమల అభివృద్ధి కూడా సమానంగా ముందుకు సాగాలంటే సమతుల్య విధానం అవసరమని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమలు సుస్థిరంగా, లాభదాయకంగా కొనసాగితేనే ఉపాధి అవకాశాలు పెరిగి, కార్మికులకు మెరుగైన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో మంగళవారం నిర్వహించిన లేబర్ కోడ్స్పై భాగస్వాముల సంప్రదింపుల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కార్మిక న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించాల్సిన నిబంధనలు, కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన సిఫార్సులపై విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యాజమాన్యాలు, కార్మికులు పరస్పర చర్చల ద్వారా సహేతుకమైన నిర్ణయాలకు వస్తే పరిశ్రమల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. పరిశ్రమలు బాగా నడిస్తే కార్మికులు కూడా ప్రయోజనం పొందుతారని, పరిశ్రమల విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు, మెరుగైన సంక్షేమ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
లేబర్ కోడ్స్పై పారిశ్రామిక వర్గాలు, కార్మిక సంఘాలు ఎలాంటి సంకోచం లేకుండా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని మంత్రి కోరారు. అదే సమయంలో కార్మికుల హక్కులు, సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. కార్మికులు, పరిశ్రమలు రెండింటికీ మేలు చేసే సమతుల్య విధానమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు పారిశ్రామిక సంఘాలతో గత కొన్ని నెలలుగా విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీలు) ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్ది, పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
కనీస వేతనాల పెంపు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే సంప్రదింపుల విధానాన్ని అనుసరించిందని మంత్రి తెలిపారు. పారిశ్రామిక సంఘాలు, ఇతర భాగస్వాములతో విస్తృత చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత పదేళ్లుగా కనీస వేతనాల్లో పెంపు లేకపోవడంతో కార్మికుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేశారు. కార్మికుల అవసరాలు, పరిశ్రమల సామర్థ్యాన్ని సమతుల్యం చేస్తూ ప్రతిపాదనలు రూపొందించామని, ప్రభుత్వ నిర్ణయానికి సహకరించిన పారిశ్రామిక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.
“లేబర్ కోడ్స్ను హడావుడిగా అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రతి అంశంపై సమగ్ర చర్చ జరగాలి. అవసరమైతే లిఖితపూర్వకంగా సూచనలు ఇవ్వండి. వాటిని మరోసారి పరిశీలించి, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిబంధనలను రూపొందిస్తాం” అని మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు చేసిన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
