బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం తీర్పు

whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

స్పష్టత ఇవ్వనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌తో మొదలైన రాజ్యాంగ వివాదం

గవర్నర్లకు గడువు విధించవచ్చా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి

చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకాలకు రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించవచ్చా, లేదా అనే కీలక అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. ఈ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా, అది అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో ధర్మాసనం తీర్పుపై ఆసక్తి పెరిగింది.

వివాద నేపథ్యం ఇదే..
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం, బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్లే భావించాలని గతంలో తీర్పు ఇచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది.

అయితే, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహాను కోరారు. “బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా?” అని స్పష్టత అడిగారు.

విభిన్న వాదనలు..
రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ వాదించారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ, గవర్నర్లకు కాలపరిమితి అవసరమేనని వాదించాయి.

వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ నెల 23న (ఆదివారం) పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటంతో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *