దళితుల పట్ల బీఆర్ఎస్ నాయకుల వివక్ష మరోసారి బహిర్గతం
దళితులు నిరసన తెలిపితే దాడులు.. ఆ తర్వాత శుద్ధీకరణ చేయడం దారుణం
దళితులను ఓట్ల కోసం ఉపయోగించుకోవడమే కేసీఆర్ విధానం
దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యలను సహించేది లేదు
శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, సెప్టెంబర్ 9: దళితుల పట్ల బీఆర్ఎస్ నాయకుల వైఖరి మరోసారి బహిర్గతమైందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దళితులు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు డప్పులు కొడుతూ నిరసన తెలిపిన సమయంలో వారిపై దాడులు చేయడం, అనంతరం ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం వివక్షను స్పష్టంగా తెలియజేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో దళితులు డప్పులు కొడితే సంతోషించిన కేసీఆర్.. ఇప్పుడు అదే దళితులు తమ ఆత్మగౌరవం కోసం నిరసన వ్యక్తం చేస్తే శుద్ధీకరణ చేయించడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం ద్వారా బీఆర్ఎస్ నాయకుల మనస్తత్వం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
హామీలను నిలబెట్టుకోని కేసీఆర్
కేసీఆర్ మొదటి నుంచీ దళితులను చిన్నచూపు చూస్తున్నారని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించినా ఆ హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.
దళితులకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి మరింత మందికి ప్రయోజనం కల్పించాలని తాను అప్పట్లో కోరినా కేసీఆర్ అంగీకరించలేదని వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. దళితులు పరిశ్రమలు స్థాపించుకునేందుకు పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని, చిన్న దళిత కాంట్రాక్టర్లకు పనులు కల్పించాలని తాను కోరినా బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించారని మంత్రి విమర్శించారు. రైతు బంధు పథకంలో కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పించాలని తాను సూచించినప్పుడు కేసీఆర్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు.
రూ.1,000 కోట్ల విరాళాలపై సమాధానం చెప్పాలి
చిన్న పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు సుమారు రూ.1,000 కోట్ల మేర విరాళాలు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉందని మంత్రి అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు మాత్రమే అయిందని, ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
క్షమాపణ చెప్పకుండా శుద్ధీకరణ చేయడం దారుణం
అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం తగ్గలేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పలువురు సభ్యులు సూచించినప్పటికీ.. ఆ దిశగా వెళ్లకుండా శుద్ధీకరణ వంటి చర్యలకు పాల్పడటం బీఆర్ఎస్ నాయకుల మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు.
తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం పెద్ద విషయం కాదని సభ్యులు సూచించినప్పటికీ, ఆ మార్గాన్ని వదిలి వివక్షకు తావిచ్చే చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల ఘటనపై దర్యాప్తు చేయాలి
అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన ఘటనపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి కోరారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులు ఎవరైనా గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.
ఘటన జరిగిన సమయంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని మంత్రి పేర్కొంటూ.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
