BJP extends support to strike by artisan staff

ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి విద్యుత్ సంస్థ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాల్సిందే

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి (ఈనెల 25) నుండి సమ్మెలోకి వెళుతున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీజేపీ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగిస్తామని దుర్మార్గమన్నారు. రేపటి సమ్మెను భగ్నం చేసేందుకు ఆర్టిజన్లను ముందస్తుగా అరెస్టులు చేస్తూ బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ ను ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారి సమ్మెకు సంఘీభావం ప్రకటించిన బండి సంజయ్ కుమార్ కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తూ ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఆర్టిజన్లకు విద్యుత్ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.