తెలంగాణలో వైద్య ఖర్చులు ఆకాశమే హద్దు – గ్రామాల్లో కిడ్నీ, పట్టణాల్లో క్యాన్సర్ చికిత్స భారం పెరుగుతోంది
హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఖర్చులు సాధారణ ప్రజలకు భారీగా మారుతున్నాయి. ఏ చిన్న వ్యాధి వచ్చినా కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తాజా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 80వ రౌండ్ సర్వే. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు, చికిత్స ఖర్చులు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్వే ప్రకారం, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై ఆసుపత్రి ఖర్చు సగటున రూ.52,743గా నమోదైంది. దేశంలో సగటు వైద్య ఖర్చు రూ.50 వేల మార్క్ను దాటిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కిడ్నీ వ్యాధి చికిత్సకు అత్యధిక ఖర్చు అవుతోంది. ఒక కుటుంబం సగటున రూ.76 వేల వరకు ఖర్చు పెడుతోంది. దీని తర్వాత క్యాన్సర్ చికిత్సకు రూ.62,588, గుండె జబ్బులకు రూ.47,135, ప్రమాదాల్లో గాయాలకు రూ.46,801, కండరాలు-కీళ్ల సమస్యలకు రూ.45,264, నరాల సంబంధిత వ్యాధులకు రూ.43,155 వరకు ఖర్చవుతున్నట్లు నివేదించారు.
ఇక పట్టణ ప్రాంతాల పరిస్థితి మరింత తీవ్రమైంది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స కోసం సగటున రూ.1,04,424 వరకు ఖర్చవుతోంది. దీని తర్వాత కీళ్ల నొప్పులకు రూ.76,106, కిడ్నీ సమస్యలకు రూ.71,246, గుండె జబ్బులకు రూ.69,451, నరాల సమస్యలకు రూ.62,751 వరకు ఖర్చు అవుతోంది.
నిపుణుల ప్రకారం, ప్రైవేటు ఆస్పత్రులపై అధికంగా ఆధారపడటం, ఆరోగ్య బీమా కవరేజీ తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న సౌకర్యాల వంటి కారణాలతో ఈ ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక కుటుంబాలు అప్పుల బారిన పడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవడం, ఆరోగ్య బీమా విస్తరణ వంటి చర్యలను అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
