రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం
కాంగ్రెస్లో అందరి గమ్యం ఒక్కటే.. వ్యక్తిగత విభేదాలకు తావులేదు
ప్రజా సంక్షేమం, యువతకు ఉపాధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
80 వేల పుస్తకాలు చదివి నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది?
నీళ్లు గ్రావిటీతో వస్తే.. పంపులు ఎందుకు?
కేసీఆర్ సన్న వడ్లు పండించాలన్నారు.. ఫామ్హౌస్లో దొడ్డు వడ్లు పండించారు
శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, సెప్టెంబరు 4: కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమేనని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయ భేదాలకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ అందరి గమ్యమని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పార్టీ ప్రయోజనాల కోసం నాయకులు, కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. జగన్మోహన్రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇందుకోసం రూ.23 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని వివరించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం
గత పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
యువతకు ఆధునిక నైపుణ్యాలు
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు నూతన నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. కృత్రిమ మేధ (AI) సహా ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇచ్చి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందని, పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ అవకాశం కొనసాగుతుందని, ఇందుకోసం ఈసెట్ పరీక్ష ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఫీజులు పెంచబోమని తెలిపారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు రూ.2,500 స్టైపెండ్ అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త కరిక్యులం అమల్లోకి వచ్చినా పాత కరిక్యులం కొనసాగుతుందని, విద్యార్థులు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. లెక్చరర్ల ఉద్యోగ భద్రత, జీతాలు, ప్రమోషన్లను ప్రభుత్వం పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు.
జపాన్లో తెలంగాణ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
ఇటీవల జపాన్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక సంస్థలు ఇంజినీర్లు, డిప్లొమా హోల్డర్లకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అందిస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థలు చెప్పాయని తెలిపారు. ప్రత్యేక నైపుణ్యాలు సాధించిన యువతకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వార్షిక వేతనాలు పొందే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల తీర్పు
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ‘సారు.. కారు.. పదహారు’ అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ ఏడు స్థానాలను కోల్పోయిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పారు. అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయిందని, వరుస ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీ నాయకత్వానికి తీర్పు ఇస్తున్నారని అన్నారు.
కాళేశ్వరంపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి, కమీషన్ల వ్యవహారాలు ప్రజలకు తెలిసిందేనని మంత్రి అన్నారు. రూ.20 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని, రూ.8 లక్షల కోట్ల అప్పుల నేపథ్యంలో ఏడాదికి రూ.60 వేల కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కుంగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన పోచంపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అని ప్రశ్నించారు.
లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమేంటో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీళ్లు గ్రావిటీతో వస్తే.. పంపులు ఎందుకు?
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నుంచి 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, అందులో 60 టీఎంసీలను తిరిగి వదిలేశారని మంత్రి ఆరోపించారు. ఎగువ నుంచి గ్రావిటీ ద్వారా నీరు వచ్చే పరిస్థితుల్లోనూ నీటిని ఎత్తిపోసి వృథా చేశారని అన్నారు. దీనివల్ల సుమారు రూ.3 వేల కోట్ల విద్యుత్ భారం ప్రజలపై పడిందని తెలిపారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఉందంటూ కేటీఆర్, హరీశ్రావు కన్నెపల్లి పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారని, నీరు సహజంగా వస్తుంటే మళ్లీ పంపులు ఎందుకు ప్రారంభించాలని ప్రశ్నించారు.
80 వేల పుస్తకాలు చదివి కట్టిన ప్రాజెక్టు ఎందుకు కుంగింది?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివారని బీఆర్ఎస్ నాయకులు గొప్పగా చెప్పుకున్నారని మంత్రి గుర్తుచేశారు. 80 వేల పుస్తకాలు చదివి నిర్మించిన ప్రాజెక్టు అయితే.. కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సన్న వడ్లు చెప్పి.. ఫామ్హౌస్లో దొడ్డు వడ్లు
రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మంత్రి అన్నారు. రైతులు సన్న వడ్లు మాత్రమే పండించాలని కేసీఆర్ సూచించినప్పటికీ.. ఆయన ఫామ్హౌస్లో మాత్రం దొడ్డు వడ్లు పండించారని విమర్శించారు. రైతులకు ఒకటి చెప్పి.. ఆచరణలో మరొకటి చేయడం బీఆర్ఎస్ నాయకుల విధానమని అన్నారు.
డీఎంఎఫ్టీ నిధుల మళ్లింపుపై హరీశ్రావు సమాధానం చెప్పాలి
మంచిర్యాల జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకు మళ్లించారని మంత్రి ఆరోపించారు. ఈ నిధుల మళ్లింపుపై మాజీ మంత్రి హరీశ్రావు మంచిర్యాల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎంఎఫ్టీ నిధులను జిల్లాలోనే వినియోగించి ఉంటే మంచిర్యాల మరింత అభివృద్ధి చెందేదన్నారు.
ఎల్నినోను రాజకీయాలకు ముడిపెట్టొద్దు
ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉందని, జపాన్, కొరియా వంటి దేశాల్లోనూ వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ఏ ప్రభుత్వం గానీ, ప్రతిపక్షాలు గానీ నియంత్రించలేవని, వాటిని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు.
జర్మన్ భాష నేర్చుకున్న వారికి ఉద్యోగాలు
అనంతరం మందమర్రిలోని జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. జర్మన్ భాష నేర్చుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి వారి శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా జర్మన్ భాషలో నైపుణ్యం సాధించిన వారికి టామ్కామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
