HCA–విశాఖ వివాదంలో వాస్తవాలను వక్రీకరించడం సరికాదు: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
రూ.68.73 కోట్ల అంశం కోర్టుల తీర్పుల వల్ల ఏర్పడిన చట్టబద్ధమైన బాధ్యత మాత్రమేనని స్పష్టం
విశాఖ ఇండస్ట్రీస్ ఖాతాలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని వెల్లడి
హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) – విశాఖ ఇండస్ట్రీస్ కేసులో రూ.68.73 కోట్ల అంశంపై జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ అంశం ఏ వ్యక్తి నిర్ణయం వల్ల ఏర్పడింది కాదని, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన న్యాయ ప్రక్రియ ఫలితమని తెలిపారు.
శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి, 2004లో ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణ సమయంలో HCA తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, అప్పటి పరిస్థితుల్లో విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి స్పాన్సర్గా వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి స్టేడియం రావాలనే ఉద్దేశంతో తమ తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి సహకారంతో సంస్థ ఆర్థిక సాయం అందించిందని చెప్పారు.
ఈ ఒప్పందానికి HCA ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జనరల్ బాడీ కూడా ఆమోదం తెలిపిందని, ఇది వ్యక్తిగత నిర్ణయం కాదని, HCA అధికారిక నిర్ణయమని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం స్టేడియం పేరు మారినా, ఒప్పందంలోని ఇతర హక్కులు కొనసాగుతాయని HCA లిఖితపూర్వకంగా అంగీకరించిందని పేర్కొన్నారు.
2011లో HCA ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయడంతో విశాఖ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే తీర్పు ఇచ్చిందని, ఎలాంటి అదనపు ప్రయోజనాలు కల్పించలేదని చెప్పారు. అనంతరం కమర్షియల్ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించాయని వివరించారు.
రూ.68.73 కోట్ల అంశంపై మంత్రి వివరణ ఇస్తూ, 2016లో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ నిర్ణయించిన అసలు అవార్డు మొత్తం రూ.25.92 కోట్లేనని తెలిపారు. HCA వివిధ కోర్టుల్లో కేసులు వేయడంతో, ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం సంవత్సరానికి 18 శాతం వడ్డీ చేరి, తొమ్మిదేళ్లలో మొత్తం రూ.68.73 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది కోర్టు తీర్పుల వల్ల ఏర్పడిన చట్టబద్ధమైన బాధ్యత మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించారనే ప్రచారాన్ని కూడా మంత్రి ఖండించారు. కోర్టు ఆదేశాల మేరకు HCAకు సంబంధించిన నిధులు బ్యాంకులో ఫ్రీజ్ అయ్యాయని, అవి ఇప్పటికీ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నాయని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని వెల్లడించారు.
కొంతమంది కోర్టు తీర్పులను, వాస్తవాలను పక్కనపెట్టి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కావాలనే సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే పరువునష్టం నోటీసులు జారీ చేసినట్లు, అవసరమైతే తదుపరి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే విశాఖ ఇండస్ట్రీస్ గతంలో అనేక జిల్లా, గ్రామీణ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లకు స్పాన్సర్గా వ్యవహరించిందని, భవిష్యత్తులో కూడా క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. కోర్టుల తీర్పులను గౌరవించాలని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఆయన సూచించారు.
