HyderabadLatestTelangana

పాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ

పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి అవకాశాల విస్తరణే లక్ష్యం

హైదరాబాద్, ఆగస్టు 20: పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.

సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పాలిటెక్నిక్‌లను కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (CTE) పరిధి నుంచి కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (CET) పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2026 జూన్ 16న జీఓ 97 జారీ చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికి, దాని గుర్తింపును మార్చడానికి కాదని, కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు/అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)లను CET పరిధిలోకి తీసుకురావడం ద్వారా సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావచ్చని చెప్పారు.

జేఏసీ ప్రతినిధులతో చర్చలు

పాలిటెక్నిక్‌ల పునర్వ్యవస్థీకరణపై జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిందని మంత్రి తెలిపారు. జేఏసీ ఛైర్మన్ నాగరాజు, కన్వీనర్ సురేశ్ తదితరులతో జరిగిన సమావేశంలో వారి అభిప్రాయాలు, సందేహాలు, ఆందోళనలను ప్రభుత్వం తెలుసుకుందని చెప్పారు.

విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా పునర్వ్యవస్థీకరణను అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

మూడేళ్ల డిప్లొమా కోర్సులో మార్పుల్లేవు

ప్రస్తుతం అమల్లో ఉన్న మూడేళ్ల AICTE గుర్తింపు పొందిన డిప్లొమా కోర్సులు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. కోర్సు వ్యవధి, గుర్తింపు, విద్యా విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ ఫీజు కూడా కొనసాగుతుందని, విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

TG ECET లేటరల్ ఎంట్రీ కొనసాగింపు

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు TG ECET ద్వారా ఇంజినీరింగ్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ పొందే విధానం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు.

ATCల్లో EWS విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.2,000 స్టైపెండ్‌ను పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా CET పరిధిలో అమలవుతున్న సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌కు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా అర్హత పొందుతారని చెప్పారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదు

SBTETను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. పాలిటెక్నిక్ విభాగం CET పరిధిలో ప్రత్యేక యూనిట్‌గా పనిచేస్తుందని చెప్పారు.

పాలిటెక్నిక్ ప్రవేశాలు, పరీక్షలు, డిప్లొమా పరీక్షలు, ఇతర విద్యా వ్యవహారాలను ఈ విభాగమే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు పరీక్షల విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

ఉద్యోగాల సంఖ్య తగ్గదు

పాలిటెక్నిక్ విభాగంలోని ప్రస్తుత క్యాడర్, ఉద్యోగాల సంఖ్యను కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగాల కోత ఉండదని స్పష్టం చేశారు.

అదే సమయంలో YISUలో పరిపాలనా, బోధనా విభాగాల్లో అదనపు రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో పాలిటెక్నిక్ ఉద్యోగులకు భవిష్యత్తులో మరిన్ని కెరీర్ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

ఉద్యోగుల సర్వీస్ ప్రయోజనాలకు పూర్తి రక్షణ

పాలిటెక్నిక్ ఉద్యోగుల సర్వీస్ కండిషన్లకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగ హోదా, పే స్కేళ్లు, డీఏ, ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, పదోన్నతులు, GPF, PRAN, గ్రాట్యుటీ, పెన్షన్ తదితర ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు.

భవిష్యత్ నియామకాలు TGPSC ద్వారానే కొనసాగుతాయని, రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు యజమానిగా ఉంటుందని స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్‌లను SHAKTI పరిధిలోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు YISU ఉద్యోగులుగా మారరని, వారు PPP ఉద్యోగులుగా మారే అవకాశమే లేదని మంత్రి స్పష్టం చేశారు.

టాటా టెక్నాలజీస్‌తో రూ.2,300 కోట్ల భాగస్వామ్యం

పాలిటెక్నిక్ విద్యను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో భాగంగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేళ్లకు రూ.2,300 కోట్ల విలువైన ఎంవోయూ కుదిరిందని మంత్రి తెలిపారు.

తెలంగాణలో ఇప్పటికే 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అభివృద్ధి చేశామని చెప్పారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించడమే వీటి లక్ష్యమన్నారు.

200కుపైగా పరిశ్రమలతో ఎంవోయూలు

ప్లేస్‌మెంట్లు, శిక్షణ, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్ అప్‌గ్రేడేషన్ కోసం ఇప్పటికే 200కుపైగా పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయని మంత్రి తెలిపారు.

సిస్కో, మైక్రోసాఫ్ట్, మహింద్రా & మహింద్రా, జీఎంఆర్, స్విగ్గీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తదితర ప్రముఖ సంస్థలు ఈ భాగస్వామ్యంలో ఉన్నాయని చెప్పారు.

ప్రతి పాలిటెక్నిక్‌లో ప్లేస్‌మెంట్ సెల్

రాష్ట్రంలోని ప్రతి పాలిటెక్నిక్‌లో ప్రత్యేక ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలను పెంచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ సర్టిఫికేషన్లు, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు

YISU ద్వారా వివిధ దేశాలతో ఉన్న ప్రభుత్వ భాగస్వామ్యాలను ఉపయోగించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

డిప్లొమా అర్హతకే పరిమితం కాకుండా అంతర్జాతీయ సర్టిఫికేషన్లు, పరిశ్రమ అనుభవం, గ్లోబల్ ప్లేస్‌మెంట్ అవకాశాలు పొందేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.

పాలిటెక్నిక్ ఆస్తులు YISUకి బదిలీ కావు

పాలిటెక్నిక్‌లకు సంబంధించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులను YISUకి బదిలీ చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్ ఆస్తులు CET పరిధిలోనే ఉంటాయని, వాటి నిర్వహణ కూడా CET ద్వారానే కొనసాగుతుందని తెలిపారు.

PM SETUలో తెలంగాణకు అగ్రస్థానం

ప్రధానమంత్రి PM SETU పథకం కింద తెలంగాణలో నాలుగు క్లస్టర్లు ఎంపికయ్యాయని మంత్రి తెలిపారు.

నైపుణ్యాభివృద్ధిని PPP విధానంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ క్లస్టర్లు పనిచేస్తాయని చెప్పారు. దేశంలోనే అత్యధిక PM SETU క్లస్టర్లు తెలంగాణలో ఎంపిక కావడం గర్వకారణమన్నారు.

టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మోడల్‌ను కేంద్ర ప్రభుత్వం PM SETU నమూనాగా స్వీకరించడం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు.

జాయింట్ కోఆర్డినేషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

పునర్వ్యవస్థీకరణ అమలుకు సంబంధించి SBTET, AICTE, YISU, పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రతినిధులతో జాయింట్ కోఆర్డినేషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ టాస్క్‌ఫోర్స్ ద్వారా సమగ్ర కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందించి, పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధుల నుంచి వచ్చే సమస్యలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.

“పాలిటెక్నిక్‌ల గుర్తింపు మారదు”

“పాలిటెక్నిక్‌ల గుర్తింపును మార్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం. SHAKTI వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగుల విద్యా, సర్వీస్, ఆర్థిక ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తాం. పరిశ్రమలతో అనుసంధానం పెంచి విద్యార్థులకు మరిన్ని ఉపాధి, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, అంతర్జాతీయ అవకాశాలు కల్పిస్తాం” అని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగుల హక్కులు, పాలిటెక్నిక్‌ల విద్యా ప్రమాణాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

Cyber Post

About Cyber Post Cyber Post is a leading online news portal based in Hyderabad, dedicated to delivering accurate, timely, and trustworthy news to readers across India and beyond. Guided by our tagline — “News You Can Trust” — we are committed to upholding the highest standards of journalism in an era of rapid digital transformation and information overload. At Cyber Post, our mission is simple yet powerful: to inform, inspire, and empower our audience with credible reporting, insightful analysis, and unbiased coverage. Our team of experienced journalists and digital media professionals work around the clock to bring you the latest updates from politics, business, technology, entertainment, sports, and current affairs — all presented with integrity and clarity. Founded in Hyderabad, the city’s dynamic spirit of innovation and diversity inspires our approach to journalism. Whether it’s breaking news, investigative reports, or community stories, Cyber Post stands as a trusted source for truth in the digital age. With a growing readership and a reputation for credibility, Cyber Post continues to redefine digital news by blending traditional journalistic values with modern storytelling and technology. Cyber Post – News You Can Trust.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *