ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే
అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా కల్పించడమే లక్ష్యం
సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ‘లోగో’తో కూడిన స్టిక్కర్
జూన్ 2-12 వరకు ‘ప్రజాపాలన’ ముగింపు వేడుకలు
అధికారులకు మంత్రి వర్గ ఉప సంఘం ఆదేశాలు
హైదరాబాద్, మే 27: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించింది. సచివాలయంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీ సమావేశమైంది. సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఎన్.ఉత్తమ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకంతోపాటు జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర స్థాయిలో చేపట్టనున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ముగింపు కార్యక్రమంపై సబ్ కమి టీ చర్చించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతను కల్పించడమే ధ్యేయంగా ప్రభు త్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపింది. ఇందుకోసం రాష్ట్రవ్యా ప్తంగా సమగ్ర గృహస్థాయి డేటాను సేకరించాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనామిగిలిపోతే.. అలాంటి వారి కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని సూచించింది. పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ప్రత్యేక లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం విజయవంతం కావడంతో జూన్ 2 నుంచి 12 వరకు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఇప్పటివరకు నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ ప్రగతిని కమిటీ సమీక్షించింది. జూన్ 2 నుంచి 12 వరకు పర్యావరణ వారోత్సవం, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రచా రం, మహిళా-శిశు రక్షణ, గృహ నిర్మాణం, పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలతోపాటు పట్టణాభివృద్ధి, హరిత ఇంధన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించాలని సూచించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది.
