పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం.. ప్రమాదాల నివారణపై ప్రభుత్వం అత్యంత సీరియస్: మంత్రి వివేక్ వెంకటస్వామి
రిస్కీ ఆపరేషన్లలో కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయించొద్దు – కంబస్టిబుల్ డస్ట్ ప్రమాదాల నివారణకు కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులు కలిసి బలమైన సేఫ్టీ కల్చర్ను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు.
లక్డీకాపూల్లోని ఎఫ్టీసీసీఐలో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల “ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్” జాతీయ స్థాయి వర్క్షాప్ను మంత్రి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబస్టిబుల్ డస్ట్పై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ఇప్పటికే సమగ్ర భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలకు ప్రభుత్వం ఎక్కువ స్వేచ్ఛ కల్పించిందని, అయితే ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం లేకుండానే పరిశ్రమలు స్వయంగా అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించే సంస్కృతిని అలవర్చుకోవాలని సూచించారు.
సిగాచి ఘటన ప్రతి పరిశ్రమకు హెచ్చరికగా నిలవాలని మంత్రి అన్నారు. రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు భద్రతా చర్యల కోసం ఖర్చు చేయకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణనష్టంతో పాటు సంస్థకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. స్వల్ప వ్యయాన్ని ఆదా చేయాలనే ఆలోచన చివరకు భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకొస్తుందని హెచ్చరించారు.
ప్రతి కంపెనీ బోర్డు సమావేశంలో పారిశ్రామిక భద్రతపై ప్రత్యేక సమీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఫ్యాక్టరీ ఆక్యుపైయర్, బోర్డు సభ్యులు భద్రతా ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, భద్రత కోసం చేసే ఖర్చును వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలని అన్నారు.
పరిశ్రమల్లో భద్రత పెరిగితే కార్మికుల్లో విశ్వాసం పెరిగి ఉత్పాదకత కూడా గణనీయంగా మెరుగవుతుందని పేర్కొన్నారు. కార్మికులకు తరచూ సేఫ్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త సాంకేతికతలు, ఉత్తమ భద్రతా విధానాలను అమలు చేయాలని సూచించారు. ఇటువంటి వర్క్షాప్లు ప్రభుత్వం, పరిశ్రమలు పరస్పరం నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించొద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిగాచి ఘటనలో ప్రమాదకర విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన అనుభవం, శిక్షణ లేకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ప్రమాదకర కార్యకలాపాలు జరిగే విభాగాల్లో కంపెనీ శాశ్వత ఉద్యోగులే విధులు నిర్వహించేలా వచ్చే ఆరు నెలల్లో తగిన నిబంధనలు రూపొందించాలని ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి ప్రమాదకర అంశాలపై ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు రూపొందించి అన్ని పరిశ్రమల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్కు మంత్రి సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉందని, కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త డా. సూర్యనారాయణ, ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ మోహన్ బాబు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్ అధికారులు, నిపుణులు, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్, టెక్స్టైల్ తదితర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
